కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఎస్టీ గిరిజన బాలికల వసతి గృహంలో ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు మహిళా భద్రత, ఆత్మవిశ్వాసం, విద్యా ప్రాధాన్యతపై మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. గిరిజన విద్యార్థి సంఘం (జి.వి.ఎస్.), ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (ఏ.ఐ.బి.ఎస్.ఎస్.) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై షీ టీం సిబ్బంది అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే వేధింపులు, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అలాగే విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, విద్య ద్వారా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సూచించారు. చదువుతో పాటు మహిళా భద్రతపై అవగాహన కలిగి ఉండటం ప్రతి విద్యార్థినికి అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సంతోష్, షీ టీం సౌజన్యతో పాటు కామారెడ్డి జిల్లా నాయకులు సురేందర్ నాయక్, చౌహాన్ వినోద్ నాయక్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని మహిళా భద్రతకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు.