[caption id="attachment_5912" align="alignright" width="1080"]
నిజామాబాద్: ఆల్ప్రాజోలం మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ నిజామాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు నిందితుల అక్రమ ఆస్తులను గుర్తించి ఎన్డీపీఎస్ చట్టం కింద అటాచ్మెంట్ చర్యలు అమలు చేశారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏసీపీ బి. ప్రకాష్ పర్యవేక్షణలో రూరల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. శ్రీనివాస్, ఈగల్ టీమ్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. గతంలో నమోదైన కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, వారిలో నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వారి వద్ద నుంచి 1.087 కిలోల ఆల్ప్రాజోలం, రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర మార్గంగా ఆల్ప్రాజోలం నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల విక్రయాల ద్వారా భారీగా సంపాదించిన సొమ్ముతో నిందితులు వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు గంధం శ్రీనివాస్ గౌడ్, బొట్ల కాటమయ్య గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులకు చెందిన 4.20 ఎకరాల వ్యవసాయ భూమి, 667 గజాల ఖాళీ స్థలాలు, రెండు నాలుగు చక్రాల వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.5 లక్షల నగదును గుర్తించి జప్తు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లుగా ఉండగా, బహిరంగ మార్కెట్లో మరింత అధికంగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ కేసుల దర్యాప్తులో నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా, వారి అక్రమ ఆస్తులను గుర్తించి జప్తు చేయడం ద్వారా డ్రగ్ మాఫియాపై ఆర్థికంగా కూడా గట్టి దెబ్బ కొడుతున్నామని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా డయల్-112కు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.[/caption]