[caption id="attachment_5764" align="alignright" width="1200"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని :-ఫతేనగర్ గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని వరిపొలాలకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల వర్షాభావ పరిస్థితులు కొనసాగడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి, రైతులు ఆధారపడిన బోర్లు కూడా అడుగంటిపోయాయని రైతులు వాపోతున్నారు.
అలీసాగర్ లిఫ్ట్ ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన రైతులకు ఇప్పటికీ నీటి సరఫరా లేకపోవడంతో పంటల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఇప్పటికే వరి సాగు కోసం రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులపై భారీగా పెట్టుబడులు పెట్టగా, ఇప్పుడు నీటి కొరతతో ఆ పెట్టుబడులన్నీ వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫతేనగర్ ఫార్మర్ సొసైటీ మాజీ చైర్మన్ హాజీ మాట్లాడుతూ, గ్రామంలోని రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందన్నారు. పంటలను కాపాడేందుకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా అత్యవసరంగా సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, సాగునీటి శాఖ అధికారులను కోరారు. బోర్లు అడుగంటిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగునీటి ఏర్పాట్లు కూడా వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల కష్టాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకుని ఫతేనగర్ రైతుల వరిపంటలను కాపాడాలని గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల చూపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే నిలిచింది.[/caption]