కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల యాజమాన్యాలు, గుమస్తాలు, అమలీలు పాల్గొని ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బిల్లులన్నింటినీ వెంటనే చెల్లించాలని, నిజమైన కారణాలతో ఉన్న కేసుల్లో 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీపై మాఫీ లేదా పునఃసమీక్ష చేయాలని కోరారు. మిల్లుల వాస్తవ సామర్థ్యానికి అనుగుణంగా న్యాయమైన ధాన్యం కేటాయింపు చేయాలని, శాస్త్రీయ పద్ధతిలో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి వాస్తవిక దిగుబడిని నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
సీఎంఆర్ సరఫరాకు వాస్తవిక గడువులు నిర్ణయించాలని, ముడి బియ్యం, ఉడికించిన బియ్యానికి స్పష్టమైన విధానం అమలు చేయాలని కోరారు. తగినంత గోదాములు, నిల్వ సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యుత్, కార్మికులు, ఇతర ఉత్పత్తి వ్యయాలను పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. నిజాయితీగా పనిచేసే మిల్లులను ఉద్దేశపూర్వకంగా విఫలమైన మిల్లులతో సమానంగా చూడకూడదని కోరారు.
పెండింగ్ మిల్లింగ్ పూర్తయ్యే వరకు కొరత చర్యలు నిలిపివేయాలని ఆల్ ఇండియా రైస్ మిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వడ్డీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యానికి ఉడికించిన బియ్యం మాత్రమే అనుకూలమని, ఎఫ్సీఐ ముడి బియ్యం నిబంధనను ఉపసంహరించుకోవాలని కోరారు.
ధర్నాలో జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కార్యదర్శి సంతోష్కుమార్, కోశాధికారి దర్శన్, కామారెడ్డి డివిజన్ అధ్యక్షుడు ముగినపల్లి భూమేష్, మాజీ అధ్యక్షులు లింగం, శ్రీనివాస్రెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి గౌరీశంకర్, జంగంపల్లి నాగరాజు, బాన్సువాడ దుర్కి రాజు తదితరులు పాల్గొన్నారు.