బ్లాక్మెయిలింగ్ ఆరోపణలపై దర్యాప్తు
హైదరాబాద్ కే 24 న్యూస్ : షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటన వెనుక బ్లాక్మెయిలింగ్ మరియు వేధింపులు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అమూల్య శ్రీకి సంబంధించిన వ్యక్తిగత వీడియోలను కొందరు వ్యక్తులు రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెపై మానసిక ఒత్తిడి తీసుకువస్తూ వేధింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన అమూల్య శ్రీ సుమారు పది రోజుల క్రితం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తండ్రి లేకపోవడంతో ఆమె తల్లి ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతూ, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనలో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, సైబర్ నేరాలు, బ్లాక్మెయిలింగ్, ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు, మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా పోలీసుల నుంచి పూర్తి వివరాలు వెలువడలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.