
హత్య కేసులో నిందితునికి జీవిత కారాగార శిక్ష , మరియు రూ 1000/- జరిమానా*
*తో పాటు సాక్ష్యము దొరకకుండా శవము దాచపెట్టినందున అదనముగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా*
*కోర్టు డ్యూటీ సిబ్బంది ని అభినంధించిన పోలీస్ కమీషనర్*
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం , జులై 21 ,తెలుగు కే న్యూస్ ప్రతినిధి.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతురాలు మిర్యాల పోషవ్వ గోసంగి (50) గోవిందపేట గ్రామంలో నాడ్పి గంగారాం ఇంట్లో అద్దెకు నివసించేది. మామిడిపల్లికి చెందిన షేక్ మహబూబ్ తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు.
2025 జనవరి 30 ఉదయం సుమారు 7 గంటల సమయంలో మృతురాలి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. దర్యాప్తులో నిందితుడు షేక్ మహబూబ్ను అరెస్ట్ చేసి, పూర్తి ఆధారాలతో జిల్లా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జిల్లా జడ్జి జి.వి.ఎన్. భారత లక్ష్మి నిందితుడి నేరం రుజువైందని నిర్ధారించారు. దీంతో నిందితుడు షేక్ మహబూబ్కు హత్య చేసినందుకు జీవిత కారాగార శిక్ష , వెయ్యి రూపాయల జరిమానా తో పాటు సాక్ష్యము దొరకకుండా శవము దాచపెట్టినందున అదనముగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో నిందితునికి శిక్ష పడే విధముగా కృషి చేసిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ పి. సత్యనారాయణ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై గోవిందు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ ఎం. గంగాధర్ , పిసి : 2033 ,టి.సుభాష్, పి సి : 266 , కె. నారాయణ పిసి 2073 , శ్రీనివాస్ హోంగార్డ్ 870 లను, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. యస్., గారు అభినందిస్తూ ప్రశంసించడం జరిగింది.