నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, సెప్టెంబర్ 10, తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి డిచ్పల్లి సీఐ కె. వినోద్, ఎంఆర్ఓ కిరణ్మయి, జక్రాన్పల్లి ఎస్ఐ జి. మహేష్, సంబంధిత సర్పంచులు, విద్యుత్ శాఖ అధికారులు, గణేష్ మండపాల నిర్వాహకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ కె. వినోద్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు, వాలంటీర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మండపాల ఏర్పాటు విషయంలో రహదారులకు, ట్రాఫిక్కు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్, ఎర్తింగ్ తదితర అంశాల్లో విద్యుత్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని,
గణేష్ మండపాల నిర్వాహకులు తమ మండపాల వద్ద బాధ్యతాయుతమైన వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలని, మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఊరేగింపు సమయంలో అనుమతించిన మార్గం మరియు నిర్ణీత సమయాలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే నినాదాలు, పాటలు, వ్యాఖ్యలు చేయరాదని సూచించారు.
ప్రత్యేకంగా డీజే వినియోగంపై నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేస్తూ, డీజేల కారణంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ అంతరాయం మరియు శాంతిభద్రతలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గణేష్ ఉత్సవాలు మరియు ఊరేగింపుల్లో డీజేలను వినియోగించకూడదని సూచించారు. పోలీస్ శాఖ సూచనలు మరియు అమలులో ఉన్న నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా నిర్ణయించిన నిమజ్జన ప్రదేశాలు, మార్గాలు మరియు సమయాలను పాటించాలని, నీటి వనరుల వద్ద పిల్లలు మరియు యువత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరూ ప్రమాదకరంగా నీటిలోకి వెళ్లకుండా నిర్వాహకులు, వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు,
ఎక్కడైనా చిన్నపాటి వివాదం లేదా సమస్య తలెత్తినప్పుడు నిర్వాహకులు స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని తీవ్రతరం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ జి. మహేష్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు లేదా తప్పుడు సమాచారాన్ని గుర్తించిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాలను ప్రజలందరి సహకారంతో శాంతియుతంగా, సురక్షితంగా, మత సామరస్యంతో నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రజలు మరియు నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు.