
బెజ్జంకి: తెలుగు టీ న్యూస్ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, యువజన హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దొంతరవేణి మహేష్ అన్నారు.సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరిగిన AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్లో బెజ్జంకి మండలానికి చెందిన దొంతరవేణి మహేష్ను రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్న CPI, AIYF రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన బెజ్జంకి మండల CPI కార్యదర్శి బోనగిరి రూపేష్, AIYF సిద్ధిపేట జిల్లా కార్యదర్శి కనుకుట్ల శంకర్, బోనగిరి మహేందర్, బోనగిరి శ్రావణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి AIYF ఆధ్వర్యంలో మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని మహేష్ తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. పోటీ పరీక్షల ఫీజులను తగ్గించి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.గ్రామీణ యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు డ్రగ్స్, మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
బెజ్జంకి మండలంతో పాటు సిద్ధిపేట జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా యువజన ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని దొంతరవేణి మహేష్ తెలిపారు.




