పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి, కుప్పం MRPS నాయకులు డిమాండ్

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 11. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నూతన పెన్షన్ల కోసం అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకునే సమయంలో అనేక సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్‌హోల్డింగ్ మ్యాపింగ్, రైస్ కార్డు మ్యాపింగ్, స్కిప్పింగ్, ఓటర్ ఐడీ బూత్ మార్పులు, ఒకే హౌస్‌హోల్డింగ్‌లో కుటుంబ సభ్యుల మ్యాపింగ్ సరిగా జరగకపోవడం వంటి సమస్యల కారణంగా అర్హత ఉన్నప్పటికీ పలువురు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ఇక శని, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో దరఖాస్తుదారులకు మరింత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు. ఇలాంటి 2పరిస్థితుల్లో నిర్ణయించిన గడువులోపు దరఖాస్తు చేసుకోలేకపోతే, ఎలాంటి తప్పు చేయని అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమానికి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. పెన్షన్ అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు, అర్హులైన పేదలకు ప్రభుత్వ భరోసా. ఆ భరోసా సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యం అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరడం. కాబట్టి సాంకేతిక లోపాలను కారణంగా చూపి అర్హులైన ఒక్క కుటుంబం కూడా అవకాశాన్ని కోల్పోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అందువల్ల పెన్షన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగించడంతో పాటు, హౌస్‌హోల్డింగ్, రైస్ కార్డు, ఓటర్ ఐడీ, మ్యాపింగ్ తదితర సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించి, దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులందరికీ మరో అవకాశం కల్పించాలని ఎమ్మార్పీఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమం చేరాలి. సాంకేతిక సమస్యలు పేదల హక్కులకు అడ్డంకి కాకూడదు. ఒక్క అర్హుడు కూడా పెన్షన్‌కు దూరం కాకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో గడువు పొడిగించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కుప్పం కో ఇన్ఛార్జ్ పి.వెంకటేష్ మాదిగ, ఎంఎస్పి కుప్పం సీనియర్ నాయకుడు గోవింద మాదిగ, రామకుప్పం మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ మాదిగ, రమేష్ మాదిగ తదితరులు తక్షణమే ప్రభుత్వం స్పందించి పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని డిమాండ్ చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :