
కామారెడ్డి జిల్లా:k24 న్యూస్ తెలుగు :కామారెడ్డి, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్. వై. గిరి సూచించారు.
శనివారం కామారెడ్డి పురపాలక సంఘ సమావేశ మందిరంలో ఆగస్టు నెలకు సంబంధించిన అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘం చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 9 ఎజెండా అంశాలను కౌన్సిల్ సభ్యుల ముందుంచి చర్చించారు.
ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పురపాలక సంఘానికి సంబంధించిన వివిధ అంశాలపై సభ్యులు చర్చించారు. ఎజెండాలో ప్రతిపాదించిన 9 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
అత్యవసర సమావేశంలో భాగంగా కామారెడ్డి పురపాలక సంఘంలోని ప్రతి వార్డుకు రూ.6 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయించి, ఆయా వార్డుల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్. వై. గిరి మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. వార్డుల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పురపాలక సంఘ కమిషనర్, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, డిప్యూటీ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






