
సిద్దిపేట రూరల్, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 6:
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో వరుసగా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆలయంలో దొంగతనానికి యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డ నిందితుడి నుంచి దొంగిలించిన గంటలు, స్కూటీ, హెల్మెట్తో పాటు గంటలు, హుండీ పగలగొట్టేందుకు ఉపయోగించిన రించ్ పానాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన ఆస సుదర్శన్ (35) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతంలో వివిధ జిల్లాల్లో మోటార్సైకిళ్ల దొంగతనం కేసుల్లో పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై కుడి కాలుకు ఫ్రాక్చర్ కావడంతో పనిలేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా భద్రత లేని ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.
పలు ఆలయాల్లో చోరీలు
సెప్టెంబర్ 1న నాంచారుపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి నల్లరంగు సుజుకి అవేనిస్ స్కూటీపై వెళ్లిన నిందితుడు రెండు ఆలయ గంటలను అపహరించాడు. అనంతరం ఇరుకోడు ఎల్లమ్మ ఆలయంలో రించ్ పానా సహాయంతో పెద్ద, చిన్న గంటలతో పాటు హుండీని ఎత్తుకెళ్లాడు. హుండీని పగలగొట్టి అందులోని నగదును తీసుకుని హుండీని పొలాల్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన గంటలను సిద్దిపేటలోని పొన్నాల సమీపంలోని స్క్రాప్ షాపులో విక్రయించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా సెప్టెంబర్ 4 రాత్రి రాఘవాపూర్ ఎల్లమ్మ ఆలయంలో మూడు గంటలను, అదే రాత్రి ముస్తాబాద్ మండలం బదనకల్లోని ఎల్లమ్మ ఆలయంలో రెండు గంటలను చోరీ చేశాడు. సెప్టెంబర్ 5 ఉదయం రంగధాంపల్లి చౌరస్తాలోని స్క్రాప్ షాపులో ఆ గంటలను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
మరో చోరీకి యత్నిస్తుండగా అరెస్ట్
సెప్టెంబర్ 5న బురుగుపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద మరోసారి దొంగతనానికి ప్రయత్నిస్తూ కాపు కాస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నలుపురంగు సుజుకి అవేనిస్ స్కూటీ (TS10FC7843), ఆకుపచ్చ రంగు వేగా హెల్మెట్, రించ్ పానా, దొంగిలించిన కొన్ని ఆలయ గంటలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని పట్టుకోవడంలో సీఐ విద్యాసాగర్, దర్యాప్తు అధికారి డి. నవత, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రాజు, రవికాంత్, మల్లేష్, నాగరాజు, ప్రవీణ్, రాకేష్, ప్రదీప్, మహేష్ తదితర సిబ్బంది కీలకంగా పనిచేశారు. పోలీసు సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ అభినందించారు.






