నిజామాబాద్ జిల్లా,నవీపేట్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని నవీపేట్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ధర్మాబాద్, మహారాష్ట్రకు చెందిన సాదక్ ఖాన్, సల్మాన్ ఖాన్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు నవీపేట్ పోలీస్ సిబ్బంది గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో యాంచా గ్రామ శివారులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినందుకు సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.