కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ విద్యార్థి సంఘాల బంద్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

నిజామాబాద్ జిల్లా,నవీపేట్, జూలై 24: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నవీపేట్ మండల కేంద్రంలో విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్ నిర్వహించాయి. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మోడల్ స్కూల్ ఇంటర్ కళాశాల విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 36 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలను భగ్నం చేయడం, పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ను అరెస్టు చేయడం, నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై జరిగిన చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు.
విద్యార్థులపై జరిగిన ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు, సీపీఎం మండల కార్యదర్శి నాయక్‌వాడి శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ నాయకుడు చింటూ, పీడీఎస్‌యూ నాయకుడు రియాజ్, కేవీపీఎస్ నాయకుడు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.