

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, నైవేద్య సమర్పణ అనంతరం మహామంగళహారతి నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడగా, గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా యంచతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల నడుమ ముగిశాయి.







