తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి

హైదరాబాద్, తెలుగు కే న్యూస్ జూలై 27: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని నియమిస్తూ తెలంగాణ జాగృతి ఫౌండర్ చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థకు రాష్ట్ర అధ్యక్షురాలిగా మాధవిని నియమించినట్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైభవం, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించి ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కల్వకుంట్ల కవిత 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించారు. తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషించింది. అలాగే మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి తెలంగాణ జాగృతి విశేషంగా కృషి చేసింది.
ఇప్పటి వరకు రెండు దశాబ్దాలుగా వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగిన కల్వకుంట్ల కవిత, ఇకపై ఫౌండర్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతూనే సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని నియమించినట్లు వెల్లడించారు.
మాధవి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలంగాణ జాగృతి ఫౌండర్ చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.