
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరీక్షణ – వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల అవస్థలు
తెలుగు కే న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలనే నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ దుకాణాల వద్ద ఉదయం 7 గంటల నుంచే బారులు తీరుతున్న ప్రజలు సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రతి లబ్ధిదారుడికి బయోమెట్రిక్ (వేలిముద్ర) ధృవీకరణ తప్పనిసరి కావడంతో, ఒక్కో కార్డుదారుడికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో క్యూలు మరింత పెరిగి, గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు, యంత్రాల పనితీరు మందగించడం వల్ల కూడా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోందని చెబుతున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు వర్షం లోగంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌకధర దుకాణాల డీలర్లు కూడా ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయడం వల్ల అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు.
ప్రభుత్వాన్ని ప్రజల ప్రశ్నలు: ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వడం వల్ల ప్రజలకు ఇంతటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, విడతల వారీగా పంపిణీ చేసే అవకాశం ఎందుకు కల్పించలేదు? రేషన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు సిబ్బంది లేదా అదనపు బయోమెట్రిక్ యంత్రాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ప్రజల ఇబ్బందులను తగ్గించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ఎంత ముఖ్యమో, అవి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.






