
చేర్యాల, జూన్ 22 (తెలుగు కే న్యూస్): ఎరువుల ధరలను తగ్గించాలని, యూరియా యాప్ను తొలగించాలని, మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చేర్యాలలో జరిగిన రైతు సంఘం టౌన్, మండల కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శిస్తూ, రైతులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాగపురి కనకయ్య, ఆముదాల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




