
మంచిర్యాల, జూన్ 22 (తెలుగు కే న్యూస్): జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏసీపీ వెంకటేశ్వర్లు విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు. జైపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై భూమేష్, ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్, సర్పంచ్ కూన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




