
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : మోకాల నొప్పితో ఆరు సంవత్సరాలుగా బాధపడుతున్న వడ్లూరుకు చెందిన పెంటా గౌడ్కు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ సెంటర్ వైద్యులు తెలిపారు.
కామారెడ్డి యశోద హాస్పిటల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే వివరాలు వెల్లడించారు. మోకాళ్ల నొప్పితో కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పెంటా గౌడ్ కామారెడ్డి యశోద సెంటర్ను సంప్రదించారని, అనంతరం పరీక్షల అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లి రోబోటిక్ సర్జరీ చేయించుకున్నారని తెలిపారు.
శస్త్రచికిత్స అనంతరం కేవలం రెండు రోజుల్లోనే పెంటా గౌడ్ నడవడం ప్రారంభించారని డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజువారీ పనులు చేసుకోవడంతో పాటు బయటకు కూడా తిరుగుతున్నారని చెప్పారు.
పెంటా గౌడ్ మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా మోకాలి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నానని తెలిపారు. నొప్పి కారణంగా రోజువారీ పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేదన్నారు. డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే ఆధ్వర్యంలో రోబోటిక్ సర్జరీ చేయించుకున్న అనంతరం ప్రస్తుతం నడవడంతో పాటు బయటకు తిరుగుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
రోబోటిక్ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలో మరింత ఖచ్చితత్వం సాధించడంతో పాటు రోగి వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే తెలిపారు. మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు సరైన సమయంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని సూచించారు.





