
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి
కొండమల్లేపల్లి, k24 న్యూస్ తెలుగు జూన్ 22: మండలంలో ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ నాయకులు మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. సోమవారం మండల విద్యాశాఖ అధికారి రామావత్ నాగేశ్వరరావును కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు రామావత్ సేవ నాయక్ మాట్లాడుతూ, మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్న ప్రైవేట్ పాఠశాలలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే అనుమతులు లేకుండా కొనసాగుతున్న శిక్షణ కేంద్రాలను వెంటనే మూసివేయాలని, పాఠశాలల విద్యార్థుల రవాణాకు ఉపయోగిస్తున్న ఫిట్నెస్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల పేరుతో విద్యార్థులపై బలవంతంగా పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేయించే విధానాన్ని అరికట్టాలని కోరారు.
ప్రతి విద్యార్థి శారీరక, మానసిక వికాసం కోసం ప్రైవేట్ పాఠశాలల్లో క్రీడా పాఠాలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని ఎన్ఎస్యూఐ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు గుండాల రాజేష్ యాదవ్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.


