
గన్నేరువరం, జూలై 1 (K24 న్యూస్): గన్నేరువరం మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ నాయకులు తహసీల్దార్ ఇప్ప నరేందర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మండలంలో సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. మొదటి దశలో అందని అర్హులందరికీ రెండో దశలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, అవసరమైన చోట ప్రభుత్వ భూములను గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కాంతల అంజిరెడ్డి, మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, సహాయ కార్యదర్శి కూన మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ముల్కల పవన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.




