
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జూన్ 21 (తెలుగు కే న్యూస్): తెలంగాణ ఉద్యమ గేయకారుడు, ప్రజాకవి గూడ అంజయ్య 10వ వర్ధంతి సందర్భంగా సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
1955 నవంబర్ 1న ప్రస్తుత మంచిర్యాల జిల్లా లింగాపూర్ గ్రామంలో జన్మించిన గూడ అంజయ్య, ప్రజల కష్టాలను తన పాటల్లో ప్రతిబింబిస్తూ వేలాది మందిలో చైతన్యం నింపారు. “ఊరు మనదిరా”, “అయ్యో నీవా నువ్వు అవ్వోనివా” వంటి పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. కవి, రచయిత, గేయకారుడిగా మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా కూడా ప్రజల కోసం నిరంతరం పోరాడారు.
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన అంజయ్య, తన సాహిత్యంతో పేదల, కార్మికుల, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. అనేక సాహిత్య పురస్కారాలు అందుకున్న ఆయన 2016 జూన్ 21న కన్నుమూశారు.
గూడ అంజయ్య సాహిత్యం, ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొండు బానేష్ పేర్కొన్నారు. ఆయన సేవలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు.




