
నల్లగొండ జిల్లా తెలుగు 24 న్యూస్ పానగల్లు శివారులో ఉన్న శ్రీనిధి పైపుల కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా భారీ మొత్తంలో బియ్యం తరలింపులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరలిస్తున్నది దంపుడు బియ్యమా, లేక ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) బియ్యమా అనే కోణంలో స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఈ వ్యవహారంపై సమాచారం ఉన్నప్పటికీ, సంబంధిత విజిలెన్స్ అధికారులు నామమాత్రపు తనిఖీలకే పరిమితమయ్యారని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బియ్యం తరలింపుల వెనుక ఉన్న అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు వెంటనే రంగంలోకి దిగి సమగ్ర విచారణ నిర్వహించి, బియ్యం తరలింపులపై నెలకొన్న అనుమానాలకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు. నిజానిజాలు వెలుగులోకి వస్తేనే ప్రజల్లో నెలకొన్న సందేహాలు నివృత్తి అవుతాయని వారు పేర్కొంటున్నారు.




